అక్షరకలం కోదాడ
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు,అదే అన్నం అరల పొట్ట గల జంతువులకు మాత్రం విషతుల్యం అన్నది గుర్తించాల్సిన సత్యం.ఈ విషయం తెలియక కొంత మంది గొర్రెల పెంపకం దారులు తమ జీవాలు త్వరగా ఎదగాలనే ఆశతో , అన్నం, బియ్యం, నూక, మొక్కలు ఇతరత్రా గింజలు తినిపించి వాటి చావులకు కారణం అవుతున్నారు.
తాజాగా చిలుకూరు మండలం దుడియాతండ గ్రామానికి చెందిన ఒక రైతు రెండు గొర్రెపోతుల కొని వాటికి బియ్యం, అన్నం తినిపించడం తో వాటి పొట్ట ఉబ్బి ఆయాసంతో మేతమేయక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ పశువైద్య శాలకు తరలించారు. గొర్రె ను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించి పొట్టలో పేరుకుపోయిన ఆమ్ల ( ఆసిడ్) ద్రవాలు గ్యాస్ తొలగించి గొర్రె ప్రాణాలను కాపాడారు.
అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ సాధారణ పొట్ట కలిగిన మనుష్యులకు తేలికగా జీర్ణమయ్యే అన్నం నెమరు వేయు అరల పొట్ట గల జంతువులకు జీర్ణం కాకపోగా ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి పొట్టను నిప్పుల కొలిమిలా మార్చి గ్యాస్ తో పొట్ట ఉబ్బి తదుపరి ఊపిరి ఆడక జీవాలు చనిపోతాయని అన్నారు. రైతులు ఈ విషయం గుర్తించి పశువులకు, గొర్రెలు మేకలకు అన్నం, బియ్యం లాంటివి మేతలో ఇవ్వకూడదని సూచించారు.చికిత్సా కార్యక్రమములో సిబ్బంది చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.