సంగారెడ్డి ప్రతినిధి, అక్షరకలం..
నల్గొండ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ గా పని చేస్తున్న రూపా రెడ్డిని పదవ తరగతి విద్యార్థులు అత్యంత పాషవికంగా హత్య చేసిన ఘటనపై సంగారెడ్డిలోని మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ కరస్పాండెంట్ నవనీత తీవ్రంగా ఖండించారు. చదువుకునే విద్యార్థులే ప్రిన్సిపాల్ ను హత్య చేయడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ విషయంపై మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు క్రమశిక్షణగా ఉన్నారా లేదా అని గమనించడం వారి బాధ్యత అని తెలిపారు. పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, బైక్ ఇవ్వడం తప్పు అని అన్నారు. మొక్కయి వంగనిది మానై వంగునా అనే సామెతను గుర్తు చేస్తూ పిల్లలకు చిన్నతనంలోనే క్రమశిక్షణ, సంస్కారం నేర్పితే ఇలాంటి ఘటనలు జరగవని ఆమె అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు అసలు సమయం కేటాయించకపోవడం, తమ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనించకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని అన్నారు. చిన్నతనంలోనే చెడు అలవాట్లకు బానిసలుగా మారి తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంగా మార్చుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లల తల్లిదండ్రులు,స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వారికి క్రమశిక్షణతో పాటు వ్యక్తిత్వ వికాసం, మానసిక దృఢత్వం,యోగా వంటి పలు కీలక అంశాలపై దృష్టి సారించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని ఆమె ఆకాంక్షించారు.