👉 *మీ సమస్యలకు నేను వారధిగా ఉంటాను* – *రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్*
హైదరాబాద్, ఆగస్టు :25 (అక్షర కలం )
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన అనంతరం, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ఓయూ ఆర్ట్స్ కళాశాలకు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి పూలదండ వేసి, శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు.
తరువాత విద్యార్థులతో మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, “ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా అడుగుపెట్టలేకపోయారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఓయూకు రావడం చారిత్రాత్మక ఘట్టం” అని అన్నారు.
అలాగే ఆయన మాట్లాడుతూ, “మాజీ సీఎం కేసీఆర్ పాలనలో విద్యార్థుల సమస్యలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. కానీ డిసెంబర్ 9వ తేదీ లోపు విద్యార్థులు, యూనివర్సిటీ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ సమగ్రంగా నా దృష్టికి తీసుకురావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9వ తేదీన మళ్లీ ఓయూకు వచ్చి సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం గొప్ప విషయమని” మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి నాయకులను మీటింగ్కు ఆహ్వానిస్తూ, “మీ సమస్యలకు నేను వారధిగా ఉంటాను” అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, బొల్లి నాగరాజు, దరువు రమేష్, కుమార్, అరుణ్, చరణ్, రాజు, రమేష్, విద్యసాగర్, శ్రీనివాస్, శివ, విజయ్, నాగరాజు, కరుణాకర్, అజిత్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.