అక్షర కలం, /సెప్టెంబర్ 4
సెప్టెంబర్ 5వ తేదీన మనం జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం, మన దేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంకితం చేయబడింది. గొప్ప తత్వవేత్త, విద్యావేత్త అయిన ఆయన, తన పుట్టినరోజును కేవలం తన ఒక్కరి పుట్టినరోజుగా కాకుండా, దేశంలోని ఉపాధ్యాయులందరికీ గౌరవంగా భావించి ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకోవాలని కోరారు. ఆ నాటి నుంచి, ప్రతి సంవత్సరం ఈ రోజున ఉపాధ్యాయులు సమాజానికి అందిస్తున్న సేవలను స్మరించుకుంటున్నాం.
అయితే, ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరొక మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే. భారతదేశంలో మహిళా విద్యకు ఆద్యురాలు అయిన ఆమె, అప్పటి సంప్రదాయాలను ధైర్యంగా ఎదిరించి, కేవలం అమ్మాయిల కోసం 18 పాఠశాలలను స్థాపించారు. ఆమె చేసిన ఈ సాహసం వల్లే నేడు మహిళలు అక్షరాలు నేర్చుకుని, ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నారు. సావిత్రిబాయి ఫూలే వేసిన ఈ బలమైన పునాది, మహిళా సాధికారతకు మొదటి మెట్టుగా నిలిచింది. ఆమె చూపిన మార్గం వల్లే ఈ తరం మహిళలు సమాజంలోని ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధించగలుగుతున్నారు.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు, మనకు మార్గదర్శనం చేసిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రత్యేకంగా సావిత్రిబాయి ఫూలే గారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆమె కృషి లేకపోతే ఈ రోజు మహిళలు ఈ స్థాయిలో ఉండేవారు కాదు.
K.LakshmanRao
Former Faculty
Indian Bank