బతుకమ్మ, నిజామాబాద్ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జె.శ్రీనివాస్ రావు శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కాన్ఫరెన్స్ హాల్ లో మూడు రోజుల పాటు కొనసాగిన కమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా వారు స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకుని, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు జడ్జీలను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్ తో హైకోర్టు న్యాయమూర్తులు అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు.
