—కేసుల పూర్తిస్థాయి విచారణకు సమయం ఎక్కువ
— మధ్యవర్తితం ద్వారా కోర్టు బయటే సమస్యల పరిష్కారం
— హైకోర్టు జడ్జ్ జస్టిస్ లక్ష్మణ్
–న్యాయవాదులకు శిక్షణ తరగతులు ప్రారంభం
అక్షరకలం ప్రతినిధి, నల్గొండ
న్యాయవ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయo అందించడంలో మధ్యవర్తిత్వం (మెడియేషన్) ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె. లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో
జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయవాదులకుద్దేశించి మధ్యవర్తిత్వం పై 5 రోజులపాటు నిర్వహించే శిక్షణా తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో కుటుంబ విభేదాలు, ఆస్తి వివాదాలు, వాణిజ్య కేసులు, చిన్నచిన్న వ్యక్తిగత సమస్యల కేసులను మర్దవర్తిత్వం ద్వారా పరిష్కరించ గలిగే అవకాశం విస్తరించిందని అన్నారు. కోర్టులలో పెరిగిన కేసులను పూర్తిస్థాయిలో విచారణ చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందని, అయితే మధ్యవర్తితం ద్వారా ప్రజలు కోర్టు బయటే పరస్పర అంగీకారంతో త్వరగా సమస్యలు పరిష్కరించవచ్చని, ఇది సంబంధాలను కాపాడే సమయం ఆదా చేయడమే కాకుండా, తక్కువ వ్యయంతో అందించే పద్ధతి అని, మధ్యవర్తిత్వంలోని ప్రధాన లక్ష్యం వివాదంలో గెలుపు ఓటమి కాదని పరస్పరం అర్థం చేసుకోవడం, పరిష్కారం కనుక్కోవడమని అన్నారు. మర్దవర్తిత్వం న్యాయస్థానానికి బలం అని అన్నారు. న్యాయవాదులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలనీ, నైపుణ్యం కలిగిన శిక్షకులు ఉన్నారని, వారు చెప్పే అంశాలను ప్రతిదీ నోట్ చేసుకోవాలని, కేసులను త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని కోరారు.

అంతకుముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డీలు
హైకోర్టు జడ్జికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీడైరెక్టర్ మీడియేషన్ అండ్ అబ్జర్వేషన్ సెంటర్
సిహెచ్. పంచాక్షరి, నల్గొండ జిల్లా జడ్జి కవిత, యాదాద్రి జిల్లా జడ్జి జయరాజు పురుషోత్తం, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంత రెడ్డి, జిపి నాంపల్లి నరసింహ, న్యాయవాదులు, తదితరులు
హాజరైయ్యారు.