మందమర్రి, మే 30 అక్షర కలం:
ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా థీ సన్స్ ఆఫ్ థండర్ సత్క్రియ వరల్డ్ వైడ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని ఫస్ట్ బిలీవర్స్ థండర్ చర్చ్ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఇవాంజలిన్ ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ డైసీ లు పాల్గొని, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ప్రజలకు హెచ్బీ, రక్తంలో చక్కెర స్థాయి (ఆర్బీఎస్), ఎత్తు, బరువు తదితర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జూపాక సోలోమన్, జూపాక సుజాలత లు మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

పేద,మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామన్నారు.ఈ శిబిరంలో 80 మందికి పైగా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.