ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : తెలంగాణలో అమలవుతున్న ముస్లిం, మైనారిటీల నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని కొజ్జా కాలని లో గల ప్రైమ్ స్కూల్లో ముస్లిం, మైనారిటీ లకు నాలుగు శాతం రిజర్వేషన్లు సాధించి 30 సంవత్సరాల గడుస్తున్న సందర్భంగా బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లను రద్దు చేయడం ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సాధ్యం కాదని అన్నారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోసం ఎంతో కష్టపడి పోరాడి తెచ్చుకున్నామన్నారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ పోరాడుతూనే ఉన్నామన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. మైనారిటీ పాఠశాలలకు, నివాసభవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని, ముస్లిం మైనారిటీలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. ఈ రిజర్వేషన్ల ద్వారా ముస్లిం మైనారిటీ యువకులు ఇంజనీర్ డాక్టర్లు అయ్యారని గుర్తు చేశారు.
