అక్షర కలం, అందోలు:
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, జ్వరము, మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధిల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య అధికారి డాక్టర్ కే. లలితాదేవి వైద్య సిబ్బందికి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-ఆరోగ్యం సేవలపై గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె.లలితా దేవి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో ఈ-ఆరోగ్యం సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని,గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, రోగుల వివరాల నమోదు, పరీక్షలు, చికిత్స వివరాలను ఈ-ఆరోగ్యం పోర్టల్లో ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.

ఆసుపత్రుల్లో మందుల లభ్యత, సిబ్బంది హాజరు, సేవల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆమె సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు సులభంగా అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి రోగి వివరాలు డిజిటల్ విధానంలో నమోదు చేయడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని డాక్టర్ లలితాదేవి పేర్కొన్నారు.ఈ సమీక్షలో సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.