– యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులు…….–
– రెండు రోజులలో రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటాం: డి సి ఓ
మెదక్ / కొల్చారం జూలై03( అక్షర కలం):-
మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనాపూర్ గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గం నిర్లక్ష్యంతో రైతులకు అందని ఎరువులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు.ఖరీఫ్ సాగు జోరందుకున్న వేళ యూరియా కోసం చిన్నఘనాపూర్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొల్చారం మండలంలోని చిన్నఘనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఇప్పటివరకు ఒక్క యూరియా బస్తా కూడా చేరకపోవడంతో రైతులు ఎరువుల కోసం పలు గ్రామాలు తిరగాల్సిన దుస్థితి నెలకొంది.మండలంలోని ఇతర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు యూరియా సరఫరా కొనసాగుతున్నప్పటికీ చిన్నఘనాపూర్ సొసైటీని మాత్రం పూర్తిగా విస్మరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సొసైటీ పాలకవర్గం నిర్లక్ష్యమా? వ్యవసాయ శాఖ అధికారుల వైఫల్యమా? లేక రైతులను పట్టించుకోని ప్రభుత్వ వైఖరా? అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పంటలు కీలక ఎదుగుదల దశలో ఉన్నాయని, ఈ సమయంలో యూరియా అందకపోతే పంటల దిగుబడులు తీవ్రంగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన సమయంలో ఎరువులు అందించలేకపోతే రైతులకు సహకార సంఘాల వల్ల ఉపయోగమేంటని నిలదీస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చిన్నఘనాపూర్ సొసైటీకి తక్షణమే యూరియా కేటాయించి సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సొసైటీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామన్నారు .
ఖరీఫ్ సీజన్లో రైతులకు అత్యవసరంగా అవసరమైన యూరియా సరఫరాలో జాప్యం కొనసాగితే రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
డి సి ఓ వివరణ………
చిన్న గణపూర్ పిఎసిఎస్ కు ఎరువులు రాకపోవడంపై డి సి ఓ ను వివరణ కోరగా చిన్న ఘనపూర్ పిఎసిఎస్ లో పాలకవర్గం పంచాయతీ నెలకొందని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మార్క్ పేడ్ డి ఎం తో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా రెండు రోజులలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని డి సి ఓ పద్మ వెల్లడించారు.