మంగపేట, ఆగస్టు 22 ( అక్షర కలం ) :
గణేశ్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని మంగపేట ఎస్సై టీవీఆర్.సూరి కోరారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో, రాజకీయ నాయకులతో శుక్రవారం మంగపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సై టీవీఆర్.సూరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై టీవీఆర్.సూరి మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు తమ వివరాలు పోలీస్ స్టేషన్ లో నమోదు చేయించాలన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే వారు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీలు, యువత ముందస్తు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని భద్రత పరమైన చర్యల దృష్ట్యా పోలీసు శాఖ సూచించే నియమ నిబందనలు పాటించాలని ఎస్సై టీవీఆర్.సూరి కోరారు. శాంతి సామరస్యాల ప్రతీకగా ఉత్సవాలు ఉండాలని అన్నారు. మండపాల వద్ద నిబంధనలు పాటించాలని, పోలీసు అనుమతులు తీసుకోవాలని కోరారు. శాంతి, సామరస్యానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలని , సోదరభావంతో అందరూ కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. గణేశ్ విగ్రహాల నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను వివరించారు.