–—జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
—-నేడు ఉదయం 8 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను తెరిచి ఉంచాలి
—పోలింగ్ సిబ్బంది ఉదయం ఏడున్నర గంటలకు విధులకు రిపోర్ట్ చేయాలి
—- ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టిపోల్ లో ఉంచాలి ఆదేశం
—-టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్
అక్షరకలం ప్రతినిధి, నల్గొండ
ఏలాంటి సమస్యలకు ఆస్కారం ఇవ్వకుండా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
మంగళవారం ఆమె మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం ఉదయం 8 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను తెరిచి ఉంచాలని, దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ ను ముందుగా పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్ తో పాటు, బ్యాలెట్ బాక్స్ లను మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని, బ్యాలెట్ బాక్సులను తెరవడంపై మరోసారి దృష్టి సారించేయాలన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలలోని అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని, పోలింగ్ సిబ్బంది ఉదయం ఏడున్నర గంటలకు విధులకు రిపోర్ట్ చేయాలని చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు టి పోల్ లో ఉంచాలన్నారు. పోలింగ్ శాతం వివరాలు ఎప్పటికప్పుడు టీ పోల్ లో ఉంచేందుకు నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక ఇన్చార్జ్ ను నియమించాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో ఎక్కడ సమస్య రాకుండా చూసుకోవాలని అన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రం లోకి నీళ్ల బాటిళ్లు తీసుకు వెళ్లకుండా పూర్తిగా తనిఖీ చేసి పంపించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎంపీడీవోలు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ తో ఎప్పటికప్పుడు సమన్వయం కలిగి ఉండాలని, ఎవరైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే అవసరం అయితే పిడి ఆక్ట్ నమోదు చేసే విధంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డిపిఓ వెంకయ్య, జెడ్పి సిఈఓ శ్రీనివాసరావు, తదితరులు మాట్లాడారు.