జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదు-జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

అక్షర కలం /ప్రతినిధి :

జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ అధికారులను ఆదేశించారు .

బుధవారం ఆమె మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో యూరియా పై మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
గత రాత్రి జిల్లాకు 510 మె. టన్నుల యూరియా వచ్చిందని ,ఈ యూరియాను ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అవసరం ఉన్నంత మేర కేటాయించడం జరిగిందని తెలిపారు. యూరియా సక్రమ పంపిణీకి రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకూడదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని, ముఖ్యంగా వ్యవసాయ అధికారులపై ఎక్కువ గా ఉందని తెలిపారు. ఉన్న యూరియా నిల్వలను నిజాయితీగా అవసరమున్న రైతులకే పంపిణీ చేయాలని ఆమె ఆదేశించారు. పెద్ద రైతులు అనవసరంగా యూరియాను నిలువ ఉంచుకోవద్దని, అవసరం ఉంటేనే యూరియాను తీసుకోవాలని చెప్పారు.
కాగా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో మొత్తం 19500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు సుమారు 14000 మెట్రిక్ టన్నులు యూరియాను సరఫరా చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.

యూరియా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వచ్చిన తర్వాత సంబంధిత వ్యవసాయ సహాయ సంచాలకులు ,వ్యవసాయ అధికారులు అవసరం ఉన్న మేరకు రైతులకు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. యూరియా సక్రమ సరఫరా లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ముఖ్యంగా వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద యూరియా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ను ఆదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎరువుల గోదాములను తనిఖీచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ను కలెక్టర్ ఆదేశించారు . తహసిల్దారులు సైతం ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలు, గోదాములను తనిఖీచేయాలని చెప్పారు.

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఎరువులు ఉండేలా చూడాలని,ఎరువులు రిటైల్ షాపులకు వచ్చిన తర్వాత సక్రమ పంపిణీకి వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ఇప్పటివరకు జిల్లాకు వచ్చిన యూరియా, అవసరమన్న యూరియా, తదితర వివరాలను తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.